ప్రభుత్వ వ్యవస్థ ఏదైనా సకల జనుల సంక్షేమం కోసమే. ప్రభుత్వ శాఖలన్నీ ప్రజల సమగ్ర అభివృద్ధి సాధన కొరకే. ప్రభుత్వ ఉద్యోగులేవరైనా ప్రజలకొరకు కు మెరుగైన సేవలందించుట కోసరమే.
దేశ జనాభాలో 70% పైగా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అందుకే “పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు”, “గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం” అని జాతిపిత మహాత్మా గాంధీజీ ఉద్భోదించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు స్వాతంత్ర్యానంతరము అక్టోబర్ 2, 1952 న మూడంచెల పంచాయత్ రాజ్ వ్యవస్థ కు రూపకల్పన జరిగినది. జిల్లా పంచాయతీ, మధ్యంతర పంచాయతీ (మండలము / బ్లాకు పంచాయతీ), గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామ పంచాయతీ అనునది క్షేత్ర స్థాయిలో పరిపాలనా వ్యవస్థ. కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రంలో అసెంబ్లీలకు గ్రామ స్థాయి రూపమే “గ్రామ పంచాయతీ”. ఇది గ్రామ స్థాయిలో శాసన రూపకల్పన (తీర్మానములు) మరియు అమలు (కార్య నిర్వహణ) చేయు వ్యవస్థ. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ గ్రామ స్థాయిలో పనిచేయు అన్ని శాఖల పనితీరును పర్యవేక్షిస్తూ, సమన్వయము చేయు వ్యవస్థ. దీనిని రాజకీయ పార్టీల ప్రమేయంలేని వ్యవస్థగా శాసన కర్తలు రూపొందించారు. అందుకే ఈ వ్యవస్థను “గ్రామ సచివాలయము” అన్నారు.
భారత రాజ్యాంగము 11 షెడ్యూల్ ఆర్టికల్ 243 లో గ్రామ పంచాయతీల నిర్మాణం, గ్రామ సభ, అధికారములు, విధులు, బాధ్యతలు నిర్దేశించబడినవి. ఆర్టికల్ 243G ప్రకారము 29 అంశములు గ్రామ పంచాయతీలకు దఖలు పరచబడాలని రాజ్యాంగం నిర్దేశించింది. అవి వ్యవసాయము, భూమి అభివృద్ధి, నీటి పారుదల, పశు సంవర్ధనం, మత్స్య శాఖ, సామాజిక అడవుల పెంపకం, అటవీ ఉత్పత్తులు, చిన్న తరహ పరిశ్రమలు, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ గృహ నిర్మాణము, గ్రామీణ త్రాగు నీటి సరఫరా, ఇంధనము, రహదారులు జల రవాణా, గ్రామీణ విద్యుత్తు, సాంప్రదాయేతర ఇంధన వనరులు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ప్రాధమిక మరియు మాధ్యమిక విద్య, వృత్తి మరియు సాంకేతిక శిక్షణ, వయోజన మరియు అనియత విద్య, గ్రంధాలయములు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంతలు మరియు ఉత్సవాలు, ప్రాధమిక ఆరోగ్యము మరియు పారిశుధ్యము, కుటుంబ సంక్షేమము, మహిళా సంక్షేమము మరియు శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమము, బలహీనవర్గాల అభివృద్ది, ప్రజా పంపిణి వ్యవస్థ, సామాజిక ఆస్తుల పరిరక్షణ మరియు నిర్వహణ.
కాని ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అలసత్వం వలన ఈ శాఖలు లేదా అంశములు గ్రామ పంచాయతీలకు దాఖలు పరచబడలేదు మరియు గ్రామ స్వరాజ్య లక్ష్య సాధన అనుకున్న మేర జరుగ లేదు. దీనివలన అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులోకి రాలేదు, ధనిక పేద అంతరం పెరిగిపోయింది. క్షేత్ర స్థాయిలో అనవసర మరియు అతిగా శాఖలను వికేంద్రీకరించడం వలన అభివృద్ధి కుంటుపడింది. ఆశించిన ఫలితాలు రాలేదు.
గ్రామ పంచాయితీపరిధిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, విలేజ్ రెవిన్యూ అధికారులు, రెవిన్యూ సహాయకులు, వ్యవసాయ విస్తరణ అధికారి, హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్య కర్తలు(నర్సులు), ఆశా వర్కర్లు, అంగన్ వాడి కార్యకర్తలు, ఆయాలు, గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది, ఇంజనీరింగ్ వర్క్ ఇనస్పెక్టర్, గృహనిర్మాణ శాఖ వర్క్ ఇనస్పెక్టర్, ఫారెస్టు సిబ్బంది, పశువైద్య సహాయకుడు, ఇరిగేషన్ లస్కర్లు, విద్యుత్ లైన్ మేన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సిబ్బంది, చౌకధరల దుకాణ డీలర్లు, లైబ్రేరియన్, .
గ్రామ పంచాయితీ పరిధిలో 30 కి పైగా శాఖలు, ఆ శాఖలకు సంబంధించి 40 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వారి మధ్య సమన్వయము లేదు. మరియు శాఖా పరంగా సమన్వయ పరచడానికి అసలు ప్రయత్నమే జరుగ లేదు. దీనివలన అనుకున్నంత లక్ష్య సాధన జరుగలేదు.
ప్రభుత్వ పధకాలు, ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలంటే, సమాజ సమగ్ర అభివృద్ధి జరగాలంటే గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖలన్నీ ఒకే ఛత్రం క్రింద పనిచెయాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉన్నట్టు. ప్రజల వద్దకు పాలన చేరినట్టు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ వ్యవస్థ ఇప్పటికే ఎంతో సమర్ధవంతంగా అమలులో ఉంది.
No comments:
Post a Comment